దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ దండకారణ్యం, తెలంగాణ ప్రాంత కమిటీలకు మెయిన్ షెల్టర్ జోన్ గా ఉన్న కర్రె గుట్టలపై పార్టీ ఉనికి లేకుండా చేసే పనిలో బలగాలు నిమగ్నం అయినట్టుగా కనిపిస్తోంది. సువిశాలంగా విస్తరించిన ఈ గుట్టలపై డెన్స్ ఏర్పాటు చేసుకున్న మావోయిస్టులను ఏరి వేసినట్టయితే రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నక్సల్స్ కార్యకలాపాలకు చెక్ పెట్టినట్టు అవుతోందన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఆ ఘటనలతో…
ఇటీవల కాలంలో కర్రె గుట్టల కేంద్రంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ రెండు మూడు సార్లు కూంబింగ్ బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు కూడా జరిగాయి. అలాగే 2 నెలల క్రితం కర్రె గుట్టల సమీపంలో మావోయిస్టు పార్టీ నేత బడే దామోదర్ అలియాస్ చొక్కారావు బంకర్ నిర్మాణం చేసుకుని షెల్టర్ తీసుకున్న సమాచారం అందుకున్న చత్తీస్ గడ్ పోలీసు అధికారులు అక్కడ భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఈ సమాచరం అందుకున్న బలగాలు బడే దామోదర్ షెల్టర్ తీసుకున్న బంకర్ ను చుట్టుముట్టేందుకు రంగంలోకి దిగారు ఈ విషయం తెలిసిన దామెదర్ అతనితో పాటు ఉన్న మావోయిస్టు పార్టీ క్యాడర్ అంతా కూడా అక్కడి నుండి వెల్లిపోయింది. ఆ తరువాత అక్కడికి చేరుకున్న బలగాలకు బంకర్ లో ఉన్న మావోయిస్టు పార్టీ డంప్ స్వాధీనం చేసుకున్నాయి. వరస ఘటనలతో కర్రె గుట్టలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని చత్తీస్ గడ్ పోలీసు అధికారులు భావించినట్టు తెలిసింది. ఇదే క్రమంలో ఇటీవల కర్రె గుట్టలపై మందు పాతర పేలడం ఒకరికి గాయాలు కావడంతో పార్టీ నాయకత్వం కూడా స్పందించింది. కర్రె గుట్టల వద్దకు ఎవరూ రావద్దని సమీప గ్రామాల వాసులకు సూచన చేసింది. దీంతో కర్రె గుట్టలపై మావోయిస్టులు ఉన్నారని నక్సల్స్ ఆపరేషన్లలో నిమగ్నం అయిన పోలీసు అధికారుల అనుమానాలకు బలం చేకూరినట్టయింది.
తాజాగా…
మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు కర్రె గుట్టల కేంద్రంగా సాగుతున్న విషయంపై స్పష్టత వచ్చిన తరువాత బలగాలు ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాయి. కొద్ది రోజుల క్రితం భారీ ఎత్తున ఆహార పదార్థాలతో పాటు వంట సామాగ్రి కర్రె గుట్టల పైకి చేరిందన్న సమాచారం అందుకోవడంతో బలగాలు నిఘా కళ్లకు పని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడకు మావోయిస్టు పార్టీ మిలటరీ కమిషన్ ఇంఛార్జి హిడ్మా రెండు ప్లాటూన్లతో చేరుకున్నాడని, మరి కొంతమంది ముఖ్య నాయకులు కూడా అక్కడికి వచ్చారని తెలుసుకున్న తరువాతే చత్తీస్ గడ్ కు చెందిన పోలీసు బలగాలు ‘‘ఆపరేషన్ కర్రె గుట్టలు’’ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సుమారు 280 నుండి 300 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించడంతో పాటు వేలాది మీటర్ల ఎత్తులో ఉన్న కర్రె గుట్టలపై పోలీసు అధికారులు సమగ్రంగా అధ్యయనం చేసినట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే ఐదు రోజుల క్రితం వేలాది మంది బలగాలు కర్రి గుట్టలను చుట్టుముట్టాయి. హెలిక్యాప్టర్లు, డ్రోన్ కెమెరాల సాయంతో గుట్టలపై ఉన్న పరిస్థితిని సమీక్షిస్తూ నక్సల్స్ షెల్టర్ తీసుకున్న పాయింట్లను కూడా గుర్తించినట్టుగా ప్రచారం జరుగుతోంది. బలగాలు పెద్ద సంఖ్యలో ట్రెక్కింగ్ చేస్తూ పైకి చేరుకుంటున్నాయి. ఇందుకు అవసరమైన ప్లాన్ పక్కాగా రచించిన పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు బలగాలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
షెల్టర్ జోన్లు…
కర్రె గుట్టలపైకి చేరుకున్న బలగాలు సొరంగాలను, మావోయిస్టుల షెల్టర్ జోన్లను గుర్తించినట్టుగా సమాచారం. గుట్టల చుట్టూ, పైనా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న మావోయిస్టులు మందు పాతరలను అమర్చడంతో బలగాలు ఆచూ తూచి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎండలు కూడా మండిపోతుండడం వల్ల కర్రి గుట్టలపై సెర్చింగ్ ఆపరేషన్ కు ఆటంకం కల్గిస్తున్నప్పటికీ ట్రెక్కింగ్ లో సుశిక్షుతులైన వారినే ఇందుకు ఎంపిక చేసినట్టుగా స్పష్టం అవుతోంది. అయినప్పటికీ కొంతమంది అస్వస్థకు గురి అయినప్పటికీ మిగతా జవాన్లను ముందుకే వెళ్లాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నట్టు సమాచారం. గుట్టపైన మావోయిస్టుల అవాస ప్రాంతాలను కొన్నింటిని గుర్తించినప్పటికీ, సెర్చింగ్ మరిన్ని రోజులు కొనసాగించాల్సిన అవసరం ఉందని యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ కు ఇంఛార్జీలుగా ఉన్న పోలీసు అధికారులు బావిస్తున్నట్టుగా అర్థమవుతోంది. గుట్టలపై మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆనవాళ్లను సమూలంగా చెరిపివేయాలన్న తలంపుతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఫ్రీ జోన్ గా…
కర్రె గుట్టలపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తారస పడితే వారిని ఏరివేయడం, మందు పాతరలను, మందు గుండు సామాగ్రిని గుర్తించి తొలగించాల్సిందేనని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో అక్కడ మావోయిస్టు కార్యకలాపాలకు తావివ్వకుండా రెండు రాష్ట్రాల సరిహధ్దులోని మెయిన్ షెల్టర్ జోన్ ను కైవసం చేసుకోవాలని కఠినంగా నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా కర్రి గుట్టలపై కూడా బేస్ క్యాంపులను ఏర్పాటు చేసినట్టయితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనను కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. గుట్టలపై బేస్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టయితే తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ అంతా కూడా మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిపోనుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం మావోయిస్టు పార్టీకి ఇంతకాలం అత్యంత కీలకంగా ఉపయోగపడిన కర్రె గుట్టలను వీడక తప్పని పరిస్థితి ఎదురు కానుందని చెప్పక తప్పదు.