ఒకరి మృతి…పలువురికి గాయాలు…
దిశ దశ, హుజురాబాద్:
భాజా భజంత్రీల నడుము అంగరంగ వైభవంగా సాగుతున్న పెళ్లి ఊరేగింపులో విషాదం అలుముకుంది. ఓ వ్యక్తి చేసిన తప్పదం వల్ల గ్రామస్థులను దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి కొద్దిసేటప్లో మెట్టినింటికి చేరుతుందన్న సంబరం కాస్తా ఆవిరైపోయింది. కారు సృష్టించిన బీభత్సంతో వధూవరుల కుటుంబాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా పలువురికి గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్ పల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్ పల్లి గ్రామంలో నవ్య, అశోక్ ల వివాహాన్ని వారి కుటుంబ సభ్యులు ఘనంగా జరిపించారు. అప్పగింతల తంతు ముగిసిన తరువాత వధూవరులను సాగనంపే కార్యక్రమంలో భాగంగా భరాత్ (ఊరేగింపు) నిర్వహించారు. మేళతాళాల మధ్య నవ వధువులు కూర్చున్న కారు ముందు బంధువులు, కుటుంబ సభ్యులు ఆనందోత్సహాలతో నృత్యాలు చేస్తున్నారు. ఊరేగింపు జరుగుతున్న సమయంలో కారులో డ్రైవర్ కాకుండా వేరే వ్యక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చుని గేర్ వేసి ఉన్న కారును స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా కారు ఊరేగింపులో పాల్గొన్న వారి మీదుగా దూసుకెళ్లింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 20 మంది వరకు గాయపడగా హుటాహుటిన జమ్మికుంట, హుజురాబాద్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఉమ (38) మృత్యువాత పడగా ఆమె మృతదేహాన్ని హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. శంకరపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.